Search This Blog

Tuesday 2 April 2019

2019 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధిస్తారా??

జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం.  ఇది సంక్లిష్ట గణితం తో , కఠినమైన సూత్రాలతో ఉండటం చేత, దీనిని అర్ధం చేసుకొని సత్యమేమిటో వివరించడం అంత తేలికైన పనికాదు. అందుకే అందరూ ఒకే రకమైన జ్యోతిష ఫలితాన్ని చెప్పరు .   శాస్త్రిదే తప్పు తప్ప శాస్త్రం తప్పుకాదు.

గ్రహాలనేవి మన కర్మ భారాన్ని సూచించేవే తప్ప, అవే మన సుఖదుఃఖాలకు  కారణం కాదు. మరి ఎందుకు నవగ్రహాలకు పరిహారాలు,శాంతులు చేస్తున్నారు? ఎందుకంటే ప్రతి పదార్ధానికి వెనుక ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తినే దేవతగా భావన చేయమని మహార్హులు వాక్యం . అందుకే  గ్రహమనేది స్థూలపదార్ధ మైనా  దానిలోని శక్తి ని దేవత గా భావిస్తాము . మనం పూర్వజన్మలో చేసుకొన్న కర్మలో కొంత భాగం  ప్రారబ్ద కర్మగా  అనుభవించడానికి ఈ ప్రస్తుత జన్మ తీసుకొన్నాం.  జన్మ సమయంలో ఈ గ్రహాల స్థానం, గోచారరీత్యా  గ్రహాల చలనం అనేవి , కేవలం కర్మ సూచికలే  తప్ప అవి   కారణం కాదని గుర్తుపెట్టుకోవాలి. 
పంచభూతాలకు శాంతులు,పరిహారాలనేవి మన పూర్వజన్మల పాపపు కర్మలను కొంతైనా రద్దు చేస్తాయనే భావన, అంతేకాక, ఈ శాంతి విధానాల ద్వారా మనస్సు కొంతైనా పవిత్రమవుతుందనే భావనతో చేస్తాము. 

మరి మనిషికి స్వతంత్రం లేదా ?
 అకుంఠిత దీక్షాపరులకు, శ్రద్ధ,ఏకాగ్రత ,లక్ష్యం పై అనన్యమైన చింతన ఉన్నవారికి స్వతంత్రం ఉంటుంది తప్ప  సామాన్యులకు ఉండదు. కాబట్టి  ప్రారబ్ద కర్మ అనుభవించక తప్పదనే సామెత ఆలా వచ్చింది. 

చంద్రబాబు గారి జాతకం. 
ఇది పరాశర సిద్ధాంతాన్ని అనుసరించి గణించిన కుండలి. 
ఏప్రిల్ 20 1950 ఉదయం 6-43,కృత్తికా నక్షత్రం, శుక్లపక్ష తదియ ,గురువారం చిత్తూర్ లో జన్మించారు. 
లగ్నం : మేషం ; రాశి : వృషభం. 
నవాంశ లగ్నం : కన్య ; నవాంశ రాశి : కుంభం . 


లగ్న కుండలి బలం -దశ బలం . 
కుండలి లో లగ్నాత్ శని 5 వ  స్థానం లో ఉన్నాడు . పాపగ్రహం ,5 లో ఉంటే అంతగా ఇబ్బంది పెట్టడు . కానీ శత్రు క్షేత్రం లో ఉన్నాడు, పైపెచ్చు వక్రంగా ఉన్నాడు  కాబట్టి,మరింత పాపి గా బిహేవ్ చేస్తాడు.  అనగా దుఃఖ కారకుడు. 
2003 ఏప్రిల్ నెలనుండి 2022  ఏప్రిల్ వరకు చంద్రబాబు కి  శని మహర్దశ. అందుకే ఆయనకు 2004 నుండి  10ఏళ్ళు అధికార భంగమై ప్రతిపక్షంలోనే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సూర్య,చంద్ర అంతర్దశలు వచ్చాయో ఆయనకు తిరిగి అధికారం దక్కింది. ఆయన జాతకం లో సూర్య చంద్రులు యోగ కారకులు. 
లగ్న కుండలి రీత్యా,రాహువు ఆయనకు యోగిస్తాడు . 2016 నుండి శనితో రాహు అంతర్దశ నడుస్తుంది . దీనివలన పెద్దగా ఇబ్బంది ఉండదు. 26 మార్చి 2019  నుండి శని-రాహు వులో సూర్య ప్రత్యాంతర దశ ,ఆ తర్వాత చంద్ర ప్రత్యాంతర దశ వస్తాయి.  ఎన్నికలు కూడా ఈ రెండు శుభగ్రహాల ప్రత్యాంతర దశలలో జరుగుతున్నాయి కాబట్టి అంతా  శుభమే జరుగుతుంది. 

ప్రస్తుత గోచారం : 


ఏప్రిల్ 1 నుండి గురువు ధనస్సులో ప్రవేశించి ,శని, కేతువులతో చేరడం అనేది చాల ముఖ్యమైన మలుపు.  ఇప్పటి వరకు పోటా పోటీ గా ఉన్న దనుకొంటున్న ఎన్నికల సమరం, ఇప్పటి నుండి ఏక పక్షంగా మారే సూచనలున్నాయి.  ఎందుకంటే లగ్నం నుండి రాజ్యస్థానం లోనూ , రాశి నుండి అష్టమ స్థానం లోనూ  ఉన్న శని ,కేతువులు   అశుభ ఫలితాలను ఇచ్చే సూచనలున్నాయి.  కానీ  సరిగ్గా 31 మార్చ్ నాడు గురువు శని, కేతువులతో కలిశాడు. 
గురువు పాపగ్రహాల అశుభత్వాన్ని కొంతమేర తగ్గించేస్తాడు. గురువు,ధనుస్సు రాశి నుండి  తన 5 వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు.అలాగే 9 వ దృష్టితో  5 వ స్థానాన్ని  చూడటం చేత శత్రువులపైన ,పోటీదార్ల పైనా విజయం సిద్ధిస్తుంది.