Search This Blog

Monday 23 December 2019

గాలి కబుర్లా...!

13 జిల్లాలను 25 జిల్లాలు చేస్తాం . ఒక్కో జిల్లాకి ఒక్కో రాజధాని కడతాం. ముందుగా 3 రాజధానులు కడతా!
ఇదీ ఒక ముఖ్యనాయకుడు చెప్పే మాటలు! కనీస కామన్ సెన్స్ లోపించిందా? లేక అతితెలివితేటలు పెరిగాయా?
ఒక బెల్లం ముక్కను పెడితే లక్షల చీమలు వచ్చి పుట్టలుపెట్టి కాలనీలు ఏర్పాటు చేసుకొంటాయి. అలాగే ఒక రాష్ట్రానికి ఒక అభివృద్ధి ఇంజన్ అనేదానిని అంకురింప చేస్తే దానిని చూసి ఆకర్షితులై ఎందరో పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు తమ కంపెనీలను,పరిశ్రమలను స్థాపిస్తాయి. తద్వారా ఉద్యోగాలు, వాటిద్వారా రాష్ట్ర ఉత్పత్తి పెరుగుదల,దానిద్వారా ప్రభుత్వానికి ఆదాయం, దాని నుండి మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన , తద్వారా మరింత అభివృద్ధి ఇలా ఒక చైన్ రియాక్షన్ లెక్క రాష్ట్రం అభివృద్ధి పధం  లో దూసుకు పోతుంది. పాతప్రభుత్వాధినేత కలలు గన్న అభివృద్ధి నగరం అది. దానికి మీరు రాజధాని అని పేరుపెట్టుకొన్నా, పెట్టుకోకపోయినా ఫర్వాలేదు. అంతేతప్ప, కేవలం హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టేస్తే అది రాజధాని అవ్వదు . అభివృద్ధి  కి ఊతమివ్వదు. 
నేను చెప్పేది గాలి కబుర్లు అనుకొంటే ఒకసారి కింద చదవండి...  

రాంచీలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉన్నాయి..! ఈ రాజధాని ఎంత అభివృద్ధి చెందింది… ? రాయ్‌పూర్‌ లోనూ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఉన్నాయి..! అ సిటీ ఎంత మందికి తెలుసు..? భోపాల్‌ అతి పెద్ద రాష్ట్రానికి రాజధాని..! అభివృద్ధిలో విశాఖ స్థాయిలో అయినా ఉందా..? ఇలా చెప్పుకుంటే… దేశంలో చాలా రాష్ట్రాల రాజధానులు… కేవలం పరిపాలనాపరమైన కేంద్రాలే. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కార్యకలాపాలకే పరిమితం. ఇప్పటికి పలు రాజధానుల్లో వ్యాపార, పారిశ్రామిక ప్రగతి లేదు.
పాలన వికేంద్రీకరణ వేరు.. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. రాష్ట్రంలో ఉన్న ప్లస్ పాయింట్లను మార్కెట్ చేసి.. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారిని ఆకర్షించి.. వారి పెట్టుబడులతో రాష్ట్రాన్ని నలువైపులా అభివృద్ధి చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ. అదే సమయంలో.. ప్రభుత్వం తరపున నిధులు వెచ్చించి, అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు పెంచడం, అభివృద్ధి వికేంద్రీకరణ. 
ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అభివృద్దిని అంతా అమరావతిలోనే కేంద్రీకరించిందని, ఇతర రాజకీయ పార్టీలు ఓ రేంజ్‌లో ప్రచారం చేశాయి. కానీ.. నిజానికి అమరావతిలో కన్నా.. పరిశ్రమలు.. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం గణాంకాల ద్వారా అసెంబ్లీలోనే వెల్లడించింది. 
సీమలో తయారీ రంగం, ఉత్తరాంధ్రలో సేవల రంగం కేంద్రీకృతం అయ్యాయి. 
 గత ఐదేళ్ల కాలంలో.. రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడులు.. అభివృద్ధి అవకాశాలు వచ్చాయనేది కళ్ల ముందు కనిపించిన నిజం. 
చిత్తూరు జిల్లా శ్రీసిటీకి గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. ఐదేళ్ల తర్వాత చిత్తూరు పారిశ్రామిక ప్రగతి లెక్కలు తీస్తే,గత 50 ఏళ్లలో రానన్ని పరిశ్రమలు వచ్చాయి. 
ఇక అనంతపురంలో.. దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది. పదమూడు వేల కోట్ల పెట్టుబడితో కియా కార్ల పరిశ్రమ వచ్చింది.
 కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమవడమే కాదు, తంగడంచలో మెగాసీడ్ పార్క్ కూడా నిర్మాణం ప్రారంభించారు. సీమలో సుమారు 40 వేల కోట్ల పెట్టుబడితో అనేక చోట్ల సోలార్ ప్రాజెక్టులువచ్చాయి. ఇలా చెప్పుకుటూ పోతే.. తయారీ రంగాన్ని గత ప్రభుత్వం రాయలసీమలో కేంద్రీకరించిందని సాక్షాత్ అసెంబ్లీ లోనే నివేదిక సమర్పించారు.  
ఉత్తరాంధ్రకు ఉన్న సానుకూలతలు,అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా సేవల రంగాన్ని గత ఏపీ సర్కార్ ప్రోత్సహించింది. హైదరాబాద్‌కు మొదటి సారిగా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత.. ఇతర ఐటీ కంపెనీలన్నీ.. ఎలా క్యూకట్టాయో.. అలాగే, ఐటీ, ఫిన్ టెక్, బ్లాక్ చెయిన్ వంటి రంగాల్లో దిగ్గజ కంపెనీలను గత ఏపీ సర్కార్ ఆకర్షించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ‘గూగుల్‌ ఎక్స్‌, కండ్యుయంట్‌ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. కాపులుప్పాడలో 70వేల కోట్ల మెగా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఆదాని గ్రూప్ ఒప్పందం చేసుకుంది. లూలూ గ్రూప్ సహా.. పలు సంస్థలు పెట్టుబడులతో వచ్చాయి. ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ సేవల రంగాన్ని గత ప్రభుత్వం ఉత్తరాంధ్రలో కేంద్రీకరించింది. 
విజయనగరంలో ట్రైబల్‌, విశాఖలో ఐఐఎం, ఈస్ట్‌గోదావరిలో విద్యాసంస్థలు, ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు, ట్రిపుల్‌ ఐటీ, హార్టీ కల్చర్‌, నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు, తిరుపతి కేంద్రంగా హర్డవేర్‌ రంగం, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఇండస్ట్రీయల్‌ టౌన్‌షీప్‌, నంద్యాలను సీడ్‌ కేపిటల్‌ గా  పాత TDP ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
 పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నదుల అనుసంధానం చేసి గోదారి నీళ్లు రాయలసీమకు  తీసుకెళ్లి నా ప్రజలు పాతప్రభుత్వానికి ఓటేయలేదు.ఇది చాలా ఆశర్యం ,అంతకంటే ఎక్కువగా ఇది అన్యాయం. 
 బొల్లాపల్లి రిజర్వాయర్‌ కట్ట దానికి ని కూడా DPR తయారు చేసింది పాత ప్రభుత్వం. 


సెక్రటేరియట్ ఉంటే చాలా.. పరిశ్రమలు అక్కర్లేదా..? 
చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారనేది వాస్తవం.  రాష్ట్ర విభజన తర్వాత అమరావతి విషయంలో ఆయన వేసుకున్న ప్రణాళికలు, తన తెలివితేటలు, కష్టంతో చేసిన ప్రయత్నాలతో.. నిజంగానే ఓ అద్భుత నగరం ఆవిష్కరించబోతోందని దేశ విదేశాలలోని పెట్టుబడిదారులు గట్టిగా నమ్మారు. 
కానీ 2019 మే లో కొత్త ప్రభుత్వం వచ్చింది. 
 హైదరాబాద్‌లో అభివృద్ధి జరిగిన తర్వాత ఒక్కచోటే .. డెవలప్ చేశారని విమర్శలు ప్రారంభించిన రాజకీయం, అమరావతి విషయంలో మాత్రం.. ఇంకా పునాదులు పడక ముందే పురివిప్పుకుంది. ఫలితంగా..అది.. ఒక ప్రాంతానిది.. ఒక్క సామాజికవర్గానిది అంటూ… ప్రచారం చేసి.. ఇతరుల్లో వ్యతిరేకత పెంచేశారు. మాకేంటి.. అన్న చర్చను ఇతర చోట్ల లేవనెత్తేలా చేశారు. అభివృద్ధి అనేదానికి, రాజకీయ పార్టీలు చూసే కోణం, అవి చేసే ప్రచాాన్ని బట్టి అర్థాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి అంటే.. రాజధాని మాత్రమే. 


రాజధానిలో ఉండే వ్యవస్థలు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులను మూడు ప్రాంతాలకు పంచి గొప్ప అభివృద్ధిని చూపిస్తున్నామని చెప్పబోతున్నారు. కేవలం వాటి వల్ల నే  ఆయా ప్రాంతాల్లో  అభివృద్ధి జరిగిపోతుందని నమ్మేయడం వెర్రితనం. 
ఓ 10 ఆఫీసులు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మబలుకుతున్న నాయకులకు, వారి మాటలు నమ్ముతున్న ప్రజానీకానికి నమస్కారం. 

అభివృద్ధి అంటే ఇదా? అని ఆశర్యపోతున్న పక్క రాష్ట్రాల వారికి కూడా నమస్కారం .
 
రాష్ట్రం మొత్తం అతలా కుతలం అవుతున్నా, చోద్యం చూస్తున్న ప్రధానికి నమస్కారం.
పాలనా పరమైన వికేంద్రీకరణ కు, అభివృద్ధి వికేంద్రీకరణ కు తేడాతెలిసినా తెలియనట్లు నటిస్తున్న నాయకులకు నమస్కారం. 

కేవలం ప్రాంతాలవారీగా ఓట్లను గుంజుకోవడానికి కొన్ని పార్టీలు 3రాజధానులంటూ మూడుప్రాంతాలవారిమధ్యనచిచ్చు పెడుతున్నారు. కానీ రాష్ట్రం మాత్రం ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇది చివరికి మరోసారి రాష్ట్ర విభజనకు దారి తీసినా ఆశర్యం లేదు. అమాయకత్వమో, ప్రాంతీయ వేర్పాటు వాదమో, శాడిజమో , రాజధాని అంటే మూడు టవర్లు,300ఆఫీసులు అనుకొంటున్న నాయకుల కు ,ప్ర జా సంఘాలకు నమస్కారం.