Search This Blog

Friday 7 July 2023

గోత్ర నామాలు -ప్రవరలు


 భారతీయ సనాతన సాంప్రదాయమున దైవ లేక గురు సముఖమున తమ వంశ - వంశ మూల పురుషుల పరిచయమును ఋషి-గోత్ర ప్రోక్తము గా చేసుకునే విధానము ఉన్నది.

గోత్రము అంటే ? -సమూహము ను గుర్తించే విధానమే గోత్రం. అది ఆలమంద కావచ్చు, మానవ సమూహాలు కావచ్చు!

సనాతన కాలములో గోవులే సొమ్ములు,సంపదలు. అలాగే సంతానమే సౌభాగ్యం. భూమిని దున్ని , పాలిచ్చి  ,పాడిపంటలకు మనిషికి చేదోడుగా మెసలే గోజాతికి ,  సుఖసంతోషాలను ఇచ్చే సంతానానికి అత్యంత ప్రాముఖ్యత నిచ్చి కాచుకొనేవారు.  గోవులను ,గోశాల లను, వాటిల్లో వచ్చే సమస్యలను ,అలాగే మానవ సమూహాలఆరోగ్య మును , అది వ్యాధులను , మానసిక సమస్యలను పారద్రోలే శాస్త్రవేత్తలు,సామాజిక వేత్తలనే ఆనాడు ఋషులుగా కొలిచేవారు. ఆయా ఋషుల పేరిట ఆయా సమూహాల ను గుర్తు పెట్టుకునేవారు. ఆ గుర్తే గోత్రమైనది.  

'గోత్రం' అంటే అనేక అర్థాలు ఉన్నాయని శ్రీ సూర్యాయాంధ్ర నిఘంటువు (పేజీ. 734) వివరిస్తోంది. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొవచ్చు. వీటిలో ఏదైనా ఇక్కడి సందర్భానికి సరిపోతుంది.

'గోత్రం' అనే పదం 'గౌః' అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. 'గౌః' అంటే గోవులు, ఆవులు అని అర్థం. 'గోత్ర' అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి.

  • గోత్రం అనే పదం వేదాలకు వ్యాఖ్యానాలవంటివైన బ్రాహ్మణాలలో ఎక్కడా కానరాదు. 

వేర్వేరు మందలకు చెందిన గోవులు కలిసిపోవటం వల్ల తలెత్తే విభేదాలను సామరస్యంగా పరిష్కరించడానికి, అవసరమైన సందర్భాలలో సరైన తీర్పులు చెప్పడానికి కొందరు పెద్దలు ఉండేవారు. వీరిని వారి వారి నైతిక, ఆధ్యాత్మిక విలువల ఆధారంగా 'పర్యవేక్షకులు'గా ఎంచుకునేవారు. ఒక మందకు లేదా 'గోత్రాని'కి ఇలా అధినాయకత్వం వహించేవారిని 'గోత్రపతులు' అనేవారని, ఇటువంటి వారిలో సుప్రసిద్ధులైన వారిలో భరద్వాజుడు, శాండిల్యుడు, కాశ్యపుడు వంటి వారు ఉండేవారనీ, వారే క్రమంగా 'ఋషులు'గా గౌరవం పొందారనీ స్వామి భాస్కరానంద తమ 'Essentials of Hinduism' అనే పుస్తకంలో వివరించారు. (Pub. Sri Ramakrishna Mutt, Mylapore, Chennai, 1998, p.22)

ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి, వారంతా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల వంటి వారే కాబట్టి, సరైన జన్యువులతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు 'సగోత్రీకుల'ను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది. వివాహసంబంధాల కోసం మన గోత్రం కాని ఇతర గోత్రీకులకై అన్వేషించడం వెనుక ఇంత సశాస్త్రీయమైన కారణం ఉందన్నమాట!

జన్యుశాస్త్రం అనేది ఒకటి ఉంటుందనీ, దానివెనుక ఇంత కథ ఉంటుందనీ పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన వాళ్లు గ్రహించిన శాస్త్రీయమైన అంశాలివి!!

పురుషోత్తమ్‌ పండిట్‌ తను రాసిన 'గోత్రప్రవర మంజరి'లో మొత్తం 3 కోట్ల గోత్రాలు ఉన్నాయని అంచనా వేశారు. 

గోత్రం అంటే అభిజనం. ఏఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే- ఆ మహాత్ముల స్మరణే గోత్రం' అంటారు ద్విసహస్రావధాని, అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు. 

'బ్రాహ్మణుల గోత్రాలు ఋషుల పేర్లతో ఉంటాయి. ఉదా. ఆత్రేయస-భారద్వాజస-కౌశికస- ఇట్లా. ఇతరుల గోత్రాలన్నీ ప్రాయశః ప్రకృతి గోత్రాలు. ఉదా. మద్దిపాల, పైడిపాల, చెట్లపాల, చెరకుపాల, కుంభాల - ఇట్లా. పురుషుడు (భగవంతుడు), - ప్రకృతీ రెండూ కలిస్తేనే పరమేశ్వరుడు పూర్ణుడు. ఎక్కువతక్కువలకిక్కడ తావు లేదు' అంటారు శ్రీ మాడుగులవారు!

అసలు ఈ గోత్రాల గొడవ అంతా మొదట్లో కేవలం బ్రాహ్మణ వంశాలకే పరిమితమై ఉండేదనీ, బ్రాహ్మణులను అనుసరించే ఇతర కులాలూ గోత్రాలను పట్టించుకోవడం ఆరంభమయిందనీ కొందరు అంటారు. 

బౌద్ధమత సంబంధమైన సాహిత్యంలో ఒక క్షత్రియుడు తమ పురోహితుల గోత్రాన్ని స్వీకరించాలన్న సాక్ష్యాలు అనేకం కానవస్తాయని కరందికర్‌ తమ 'Hindu Exogamies' (page 229)లో పేర్కొన్నారు. అంటే, ముందుగా బ్రాహ్మణ కులంలో మొదలై, తర్వాత క్రమంగా ఇతరులు వారిని అనుసరించటంతో, ఇతర కులాలకూ గోత్రాలు వ్యాపించాయి. అందుకే, ఇప్పటికీ కొన్ని ఇతర కులాలవారిలోనూ బ్రాహ్మణ గోత్రాలు కానవస్తుంటాయి.

గోత్రము అనే పదంలో గో అంటే గోవు(గురువు,భూమి, వేదముల స్వరూపము), త్ర అంటే రక్షించుట అని అర్ధం. ఆటవిక జీవనానన్ని గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించుటకు నల్ల ఆవువారుకపిలగోవువారు అని, తెల్ల ఆవులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు.

 ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట, భరద్వాజ, కౌండిన్య అని గురువు పేరును గొప్పగా చెప్పుకునే వారు. తాము ఆ గురువుకు సంబంధించిన వారమని, ఆ గురువులే తమకు ఉత్తమగతులు కలిపిస్తారని వారిపేరే తమ గోత్రమని చెప్పుకునే వారు.

ఒక్కో మన్వంతరానికి ఈ ఋషులు మారతారు.ప్రస్తుత మన్వంతరానికి, వైవస్వతకు, ఏడుగురు ఋషులు,అత్రి,భృగు,కుత్స,వశిష్ట,గౌతమ,కశ్యప్ మరియు అంగీరస.

అన్ని గోత్రాలు ఈ ఋషుల నుండి ఉద్భవించాయి.

ఒకరి గోత్రం స్పష్టంగా లేనప్పుడు లేదా గోత్రం తెలియనప్పుడు, అతను మానవజాతి మరియు దేవతలకు మూలపురుషుడు కాబట్టి కశ్యప గోత్రాన్ని కేటాయించడం ఆచారం.

'

వారి గోత్రాలు తెలియని వారికి, కుటుంబం అదే జ్ఞానం కోల్పోయినందున లేదా ఒక వ్యక్తి బాల్యంలో అనాథగా మారినట్లయితే - పురోహిత కుటుంబానికి చెందిన గోత్ర మరియు ప్రవర వారి గోత్రం అవుతుంది.

ఆచార్యగోత్రప్రవరణభిజ్ఞస్తు ద్విజః స్వయం |

దత్వాత్మానం తు కస్మైచిత్తద్గోత్రప్రవరో భవేత్ ||

శాస్త్రాలలో ఇవ్వబడిన మరొక పరిష్కారం ఏమిటంటే, కశ్యప గోత్రాన్ని అంగీకరించడం, ఎందుకంటే శ్రుతులు కశ్యపుడిని మొత్తం మానవాళికి పితామహుడిగా ప్రకటించారు.

గోత్రస్యత్వపరిజ్ఞానే కాశ్యపం గోత్రముచ్యతే |

యస్మాదాః శ్రుతిః సర్వాః ప్రజాః కశ్యపసంభవాః ||

క్షత్రియ వర్ణానికి చెందిన వ్యక్తులకు విష్ణు గోత్రాన్ని మరియు వైశ్యులకు జంబు మహర్షి గోత్రాన్ని కేటాయించే పద్ధతి కూడా ఉంది.మరియు శివుడిని ఆరాధించేవారికి శివగోత్రాన్ని కేటాయించే పద్ధతి ఉంది.

తొలుత గోత్రములను బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు. ఒకే మూల(తండ్రికి) పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య (సగోత్రీకుల మధ్య) వివాహ సంబంధములు ఉండరాదని, వేరు గోత్రీకుల మధ్య వివాహములు జరపటము మంచిదని వాటి ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాలవారు గోత్రములను ఏర్పరచుకొన్నారు.

బ్రాహ్మణులు వేదవిద్యను అభ్యసించి తాము నేర్చుకున్న వేదమునే యజుర్వేద, ఋగ్వేద అని గోత్రాలను వేదముల పేర్లతో ఏర్పరుచుకొన్నారు. భూములను కలిగిన బోయ/క్షత్రియ జాతివారు భూపతి, మండల, భూపని అనే గోత్రాలను ఏర్పరుచుకున్నారు. కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే, మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద, ఉపయోగించిన ఆయుధము, వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి. ఉదాహరణకు క్షత్రియ బుషి అయిన విశ్వామిత్రుడు వంశంలో పుట్టిన ధనుంజయుడి పేరు మీద గోత్రం ఉంది, ఖడ్గ, శౌర్య, అశ్వ, ఎనుముల, నల్లబోతుల పేర్లమీదా గోత్రములు ఉన్నాయి

 

ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...

సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆయా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.

కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.

గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...

సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,
ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతుఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ..శర్మన్ అహం భో అభివాదయే ||

పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

గోత్రం వెనుక కూడా సైన్స్ దాగి ఉంది. అది ఏంటంటే.. ప్రస్తుతం మనం ఎక్కడ చూసినా జీన్ మ్యాపింగ్ అనే పదాన్ని వింటూ ఉంటాం. ఇది ఒక అధునాతన శాస్త్రం. అసలు గోత్రం వ్యవస్థ అంటే ఏమిటి ఈ వ్యవస్థ ఎందుకు ఉన్నది. వివాహంలో దీన్ని చాలా ముఖ్యంగా ఎందుకు భావిస్తారు. కొడుకులకు మాత్రమే గోత్రం ఎందుకు వారసత్వంగా వస్తుంది.

కూతుర్లకు ఎందుకు రావడం లేదు. వివాహం తర్వాత కుమార్తె గోత్రం అలా ఎందుకు మారుతుంది. గోత్రం అనే పదం రెండు సంస్కృత పదాల నుంచి ఏర్పడింది. మొదటి పదం గో అంటే ఆవు త్రాహి అంటే కొట్టం. గోత్రము అంటే గోశాల అని అర్థం. జీవ శాస్త్రం పరంగా చూసుకుంటే మానవ శరీరంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో లైంగిక క్రోమోజోములు ఒకటి తండ్రి నుంచి ఒక తల్లి నుంచి వచ్చే ఒక జత ఉంటుంది. ఈ రెండు క్రోమోజోములు మాత్రమే వ్యక్తి యొక్క లింగనిర్ధారణ చేస్తాయి. గర్భధారణ సమయంలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే అమ్మాయి పుడుతుంది అంటారు..

అలాగే ఎక్స్, వై అయితే అబ్బాయి పుడతాడు అని నమ్ముతారు. ఇందులో ఎక్స్ తల్లి నుంచి వై తండ్రి నుంచి తీసుకుంటుంది. స్త్రీలు ఎప్పటికీ వై పొందరు కాబట్టి తన అత్తవారింటి గోత్రం వస్తుంది. అలా తన కూతురు గోత్రం వివాహం తర్వాత మార్పు చెందుతుంది. ఒకే గోత్రానికి చెందిన వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదం ఉంది. గోత్రం ప్రకారం సంక్రమించిన వై క్రోమోజోములు ఒకటీగా ఉండకూడదు ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాల్ని సక్రియం చేస్తుంది. ఈ ప్రపంచంలో వై క్రోమోజోమ్ లేనట్లయితే మగజాతి అంతమవుతుంది. కాబట్టి గోత్ర వ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి వై క్రోమోజోములు రక్షించడానికి ఉపయోగించే పద్ధతి స్వా గోత్రం.

XY లో – X తల్లి నుండి మరియు Y తండ్రి నుండి తీసుకుంటుంది.
ఈ Y ప్రత్యేకమైనది. అది X లో కలవదు. కాబట్టి XY లో, Y X ని అణచివేస్తుంది , అందుకే కొడుకు Y క్రోమోజోమ్‌లను పొందుతాడు. ఇది మగ వంశం మధ్య మాత్రమే వెళుతుంది. (తండ్రి నుండి కొడుకు మరియు మనవడు ముని మనవడు … అలా..).


మహిళలు ఎప్పటికీ Y ను పొందరు. అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో జన్యుశాస్త్రంలో Y కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలు ఎప్పటికీ Y ను పొందరు కాబట్టి స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. అలా తన కూతురి గోత్రం వివాహం తరువాత మార్పు చెందుతుంది.


ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు జన్యుపరమైన రుగ్మతలను కలిగించే ప్రమాదాన్ని పెంచుతాయి. గోత్రం ప్రకారం సంక్రమించిన Y క్రోమోజోమ్‌లు ఒకటిగా ఉండకూడదు. ఎందుకంటే అది లోపభూయిష్టమైన ఫలిత కణాలను సక్రియం చేస్తుంది. ఇదే కొనసాగితే, ఇది పురుషుల సృష్టికి కీలకమైన Y క్రోమోజోమ్ పరిమాణం మరియు బలాన్ని తగ్గిస్తుంది. కొన్ని సందర్భాలలో నశింపజేస్తాయి. ఈ ప్రపంచంలో Y క్రోమోజోమ్ లేనట్లయితే, మగజాతే అంతరించిపోయేలా చేస్తుంది.


కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి మరియు Y క్రోమోజోమ్‌ను రక్షించడానికి ప్రయత్నించే ఒక పద్ధతే స్వగోత్రం. అందుకనే స్వగోత్రీకుల మధ్య వివాహం నిషేధించారు.


మన మహా ఋషుల చే సృష్టించబడ్డ అద్భుతమైన బయో సైన్స్ గోత్రం. ఇది మన భారతీయ వారసత్వ సంపద అని నిస్సందేహంగా చెప్పవచ్చు.. మన ఋషులు వేలాది సంవత్సరాల క్రితమే “GENE MAPPING” క్రమబద్ధీకరించారు.


అందుకనే ఈసారి ఎవరైనా గోత్రమని అంటే చాదస్తం అని కొట్టి పడేయకండి .ఇలా వివరణతో సహా చెప్పండి.

No comments:

Post a Comment