Search This Blog

Monday, 5 February 2018

మోడీ పనికిమాలిన చాణక్యం - Modi's jumla

BJP వాళ్ళు ఇచ్చామని అంటారు.  
 ఏదో కొద్దిగా విదిల్చారు,ఇవ్వవలసింది చాలాఉంది,సమయం మించిపోతుంది అని  TDP వాళ్లంటారు. 
కానీ  ఆంధ్రులందరు ముక్తకంఠంతో ఒకటే మాట చెబుతున్నారు.   "మోడీ నమ్మించి ముంచేశాడు. ... "
మామూలుగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా కూడా ఇవ్వడం లేదు . పన్నులో రాష్ట్ర వాటా గా  ఇవ్వవలసిన నిధులను కూడా తొక్కి పట్టి నెమ్మదిగా ఇస్తున్నాడు. 
నిజానికి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకృత చట్టంలోని హామీ లన్నీ కూడా ఈ పాటికి పూర్తి  చేయకపోయినా కనీసం పట్టా లెక్కించాలి.  అదేమీ చేయడం లేదు . 
  • అడిగినవాటికి, ఇచ్చిన వాటికి పొంతన లేదని ఆంద్ర ప్రజలు,తెలుగుదేశం పార్టీవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విభజన నేపథ్యంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ఆర్థిక లోటు రూ.16,500 కోట్లు అయితే, కేంద్రం రూ.7,500 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని, అందులోను ఇంకా రూ.3,382 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. 
  • పోలవరంకు ఏపీ రూ.7,.431 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు రూ.4,323 కోట్లు. 
  • నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఏపీ అడిగింది రూ.11వేల కోట్లు అయితే మంజూరు చేసింది రూ.2500 కోట్లు, అందులో విడుదల చేసింది రూ.1500 కోట్లు.
  • చట్టం ప్రకారం, సుమారు 15 జాతీయ విద్యా సంస్థలను  ఈ 5 ఏళ్లలో  పూర్తి చేయాలి. కనీసం ప్రహరీ గోడలు కూడా కట్టలేదు. 
  • చట్టం ప్రకారం రైల్వే జోన్ ఇవ్వాలి. అది ఖర్చుకి సంబంధంలేని చిన్న పాలసీ మార్పు. ఒరిస్సా అభ్యంతరం చెబుతుందనే సాకు చూపించి, అదీ నెరవేర్చలేదు . 
  •  చట్టం ప్రకారం రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలి. ఏదో కాస్త బిచ్చమ్ వేశారు. అదీ విజయవాడ,గుంటూరు నగరాలకే ఇచారుతప్ప పునాదులనుండి నిర్మించు కోవలసి ఉన్న రాజధానికి ఓ చిన్న మట్టిపాకేట్ తప్ప   కనీసం చిల్లిగవ్వకూడ ఇవ్వలేదు. 
మోడీ, మాటకారే తప్ప చేతల మనిషి కాదని క్రమేణా భారతీయులందరూ గ్రహిస్తున్నారు.  

Sunday, 4 February 2018

పంటకు మద్దతు ధర - రైతుకి సంతోషధార

మన ఆంధ్రాలో ,  ఒక ఎకరాలో వరి పండించడానికి ,విత్తనాలు,ఎరువులు,పురుగుమందులు, మానవవనరుల కూలీ ,ట్రాక్టర్ ఖర్చులన్నీ కలిపి ఒకపంటకు సుమారు 30000/ అవుతుంది. ఎకరాకి సరాసరిగా 30బస్తాల దిగుబడి అనుకొందాం. అంటే, బస్తాకి అవుతున్నఖర్చు ,సుమారుగా 1000/-అవుతుంది. జైట్లీ  2018 బడ్జెట్ లో  ఏమిచెప్పారు? ఖర్చుకి 150శాతం ఎక్కువకలిపి మద్దతు ధరగా నిర్ణయించ
మన్నాడు . అంటే బస్తాకి 2500/- ధరగా  నిర్ణయించాలి .  
స్వామినాధన్  కమిటీ చెప్పినట్లు చేయాలంటే  75kg. వరి బస్తాకి  కనీస మద్దతు ధర రూ . 3000/- గా నిర్ణయించాలి . 
ఇలా చేయగలిగితే రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది. కానీ ఇంత గా మద్దతు ధర పెంచాలంటే  మార్కెట్ డైనమిక్స్  దోహద పడాలి. మార్కెట్ ని శాసించాలంటే ,  ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆలా చేయడానికి ప్రభుత్వం దగ్గర అంత డబ్బు లేదుగదా?!
మరి రైతేమి చేయాలి?
ఎకరా వరి వ్యవసాయానికి కేవలం రూ .  10000/- కంటే ఎక్కువ ఖర్చు కాకుండా జాగ్రత్త పడాలి. 
పాలు,వెన్న,గుడ్లు ,కూరల ను ఇంట్లోనే ఉత్పత్తి చేసుకోవాలి. 
పరిసరాలను,తాగునీటిని పరిశుభ్రంగా ఉంచుకొంటే సగం జబ్బులు రాకుండా కాపాడుకో వచ్చు. 
ఇవన్నీ నిజమవ్వాలంటే,అనుభజ్ఞులేమి చెప్పారో చూద్దాం . 
1. గో ఆధారిత  సేంద్రియ ,ప్రక్రుతి వ్యవసాయం చేపట్టాలి. కనీసం రెండు పాడిపశువులుండాలి. పెరట్లోనే హైడ్రోఫోనిక్స్ ద్వారా పశుగ్రాసం, కూరగాయలు  పెంచుకోవాలి. 
2. జీవాలు .. కనీసం రెండు గొర్రెలు ,10కోళ్లు పెంచుకోవాలి .
3.సమతుల్యమైన ఆహారాన్ని తీసుకొంటూ, ఆల్కహాల్,పొగత్రాగడం  లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.    అపుడే మనదేశానికి గ్రామ స్వరాజ్యం వచ్చినట్లు ...  

Related image 

Saturday, 3 February 2018

ఇపుడు చంద్రబాబు ఏమి చేయాలి?

చంద్రబాబు నమ్ముకొన్న పార్టీ నట్టేట ముంచింది. ఆంధ్రావాళ్లకి మునిగిపోవడం అలవాటే! మొన్న కాంగ్రెస్, నేడు మోడీపార్టీ ముంచింది! బలయ్యేది ఎపుడూ కూడా ఆర్భాటం తప్ప ఆలోచనలేని ఆంధ్రులే! విద్యా,వ్యాపారాలు గట్రా బాగా చేస్తారు. కానీ కులాల పేరుతొ కాట్లాడుకోవటమే తప్ప, ఐకమత్యం అనేది లేదు. 
మోదీ ఆంధ్రాకు సాయం  చేసినా చేయకపోయినా  భాజ‌పాకి ఒరిగే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు అని మోదీపార్టీ అభిప్రాయం. ప్రాక్టిక‌ల్ గా ఆలోచించుకుంటే భాజ‌పాకి  కొత్తగా వచ్చే నష్టమేమీ  ఉండదు కాబ‌ట్టి, ఆంధ్రాపై ప్రత్యేక  అభిమానం ప్ర‌ద‌ర్శించాల్సిన రాజ‌కీయ అవ‌స‌రం వారికి లేదని మోదీపార్టీ లెక్క‌ గా కనబడుతుంది.  
         ఇపుడు,చంద్రబాబు పరిస్థితి డోలాయమానంగా ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ‌ధాని నిధులు, ప్రత్యేక  ప్యాకేజీ… ఇలాంటివ‌న్నీ కేంద్రం నుంచి రావాల్సిన‌వే. అన్నిటిక‌న్నా ముఖ్యంగా, నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంపు అంశం కూడా కేంద్రం దగ్గర  ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌కీయంగా, ఆర్థికంగా ఎలా ఆలోచించినా.. ఆంధ్ర స‌ర్కారుకు కేంద్రం అవ‌స‌రం చాలా ఉంది. ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. ఈ ద‌శ‌లో భాజ‌పాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం అనేది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఇబ్బంది క‌లిగించే రాజ‌కీయ నిర్ణ‌యంగా మారుతుందేమో అనేది చంద్ర‌బాబు అభిప్రాయంగా క‌నిపిస్తోంది. 
అటు రాష్ట్ర అభివృద్ధిని,ఇటు తన పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి చంద్రబాబుది.  
ఓ పక్క  మోడీ పార్టీ కి 3 అవకాశాలున్నాయి. జగన్ పార్టీతో, చంద్రబాబు పార్టీతో, జనసేనతో కలిసినా ,కలవక పోయినా  పెద్దగా ఒరిగేదేమీ లేదు,పోయేదీ లేదు. కాపోతే,  మూడూ కూడా మోడీ మాట విని పడివుండే పార్టీలు .  అంతేకాదు, ఒక్క చంద్రబాబు పార్టీతప్పించి, ఎన్నికలలో ఎన్ని పార్లమెంట్ సీట్లు కావాలంటే అన్నీ ఇచ్చేసే పార్టీలవి . ఎన్నికలైన తర్వాత మూడు ఆంధ్రాపార్టీలు కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చేవే గానీ ఎదురు తిరిగేవి కాదు. కాబట్టి,మోదీపార్టీకి ఎవరైనా ఒక్కటే!
గెలుపు ఓటములు పక్కనబెట్టి  తమ  మాటవినే పార్టీలవైపు చూస్తున్నారు మోదీపార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో కలిసి ఎన్నికలలో కనీసం 12 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవాలని,అవసరమైతే మొత్తం 25 సీట్ల మద్దతు పొందే  పధకం రచిస్తున్నాయి. 
ఏతావాతా  ఆంధ్రాకి  ఏమిచేసినా మోడీ పార్టీకి ఓట్లు పడవు. కాబట్టి, ఎన్నికలకు ముందో,ఆ తర్వాతో సీట్లు బేరం కుదుర్చుకొంటారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత  అవసరాన్ని బట్టి, అటు  జగన్ పార్టీ  ఇటు చంద్రబాబు పార్టీ పార్లమెంట్ సభ్యుల మద్దతును పొందినా ఆశ్చర్య పడవలసింది లేదు.కాబట్టి మోదీపార్టీకు చాయిస్ ఎక్కువ ఉంది.  చంద్రబాబుకి అంత వెసులుబాటు లేదు. 

చంద్రబాబు పార్టీ ,ఆచితూచి అడుగు వేయవలసిన సమయమిది. అలాగని నమ్మించి మోసం చేసిన మోడీ పార్టీని వదిలేయక పోతే ,ఆంధ్రాజనం చంద్రబాబు పై తిరగబడే పరిస్థితి.   
ఎలా జరగాలంటే ఆలా జరుగుతుందనే భావంతో,ఆంధ్రుల సెంటిమెంట్ ని గౌరవించి మోదీపార్టీతో తెగతెంపులు చేసుకొని ఎన్నికలకు సిద్ధపడటమే  పార్టీకి మంచిది.  
కేంద్రం,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనివన్నీ అక్షరాలా అమలు చేయ వలసిందే! కొత్త ఆంధ్రరాష్ట్రంలో ఒక్క చంద్రబాబు గారికి కి తప్ప మరో నాయకుడెవ్వరికీ అలా అమలు జరిపించే పరిపాలనా అనుభవం
లేదు . అధికారం పై యావ తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అంకితభావం కూడా లేదు. అంతేకాదు, మోడీకి గానీ లేక రాబోయే ఏ పాలకులకైనా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి,జాతీయ స్థాయిలో ఒక స్థాయిని కల్పించుకోలేకపోతె , రేపు ఆంధ్రాలో ఎన్నికలలో గెలిచినా , ఆ కేంద్రప్రభుత్వం లెక్క చేయదు.

అలాంటి కూటమిని నడిపించే స్థాయి కేవలం చంద్రబాబుగారి కే ఉంది. నిజానికి ఈ విధమైన కౌంటర్ గ్రూప్ లనేవి ప్రాంతీయ వాదానికి కొమ్ముకాసి,జాతీయ వాదానికి తూట్లు పొడుస్తాయి. కానీ అనాధగా ఉన్న రాష్ట్రాన్ని బతికించుకోవడానికి తప్పదు. ఉత్తరాది రాష్ట్రాల కు ఏ విధంగా నిధులు గుమ్మరిస్తున్నారో కనీసం ఆలా ఇచ్చినా ఆంధ్రాకి చాలు.
కాబట్టి, జాతీయస్థాయి పార్టీకి కౌంటర్ గ్రూప్ ని బలవత్తరం చేసుకొంటే తప్ప,ఫెడరల్ వ్యవస్థ బతికి బట్టకట్టే కాలంకాదు.
ఒక వేళ రేపు ఆంధ్రాలో చంద్రబాబుగారి పార్టీ కాక మరోపార్టీ గెలిచినా కేంద్రం తీరు ఇంతే ! ముందు, ఏదో సాయం చేస్తున్నట్లు నటిస్తారు తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఎన్నికలలో ఓటర్లు తమ చెప్పు చేతల్లో ఉండటానికి నాయకులు వారిని పూర్తిగా ఎదగనీయరు. అలాగే రాష్ట్రాలు తమ చెప్పుచేతల్లో ఉండటానికి,కేంద్రం, రాష్ట్రాలను పూర్తిగా బలపడనీయని కాలమిది.
 
రాష్ట్ర లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రవిడ పార్టీల లెక్క   జగన్,చంద్రబాబు కలిసి రాష్ట్ర విభజన హక్కులకోసం డిమాండ్ చేయాలి.  చంద్రబాబు,మోదీపార్టీతో తెగతెంపులు చేసుకొని  అన్నిపార్టీలను  కలుపుకొని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. ఆలా పనిచేస్తేనే ఆంధ్రాకి లాభం తప్ప, లేకుంటే నష్టపోయేది ఆంధ్రరాష్ట్రప్రజలు,లాభపడేది ఉత్తరాది పార్టీలు. 
ప్రజలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లేయాలి. 

ఆంధ్రనాయకులారా! బిచ్చమెత్తడం ఇక ఆపండి! Don't Beg... Demand!

ప్యాకేజి , హోదా అనే మాటలు 60% ఓటర్లకు అర్ధం కావు . 
ప్యాకేజి , హోదా అంటే ఏమిటో , వాటి వలన వచ్ఛే లాభమేమిటో , వాటి మధ్య ఉన్న తేడా ఏమిటో , 
  మిగతా 35 శాతం ఓటర్లకు తెలియదు .  
గతవారం  ఆంద్ర ప్రదేశ్ లో  భిన్న వర్గాలు చేసిన సర్వే లో దాదాపుగా అరవై అయిదు నుంచి డబ్భై శాతంమంది "హోదా అంటే ఏమిటో తమకు స్పష్టత లేదని'' వ్యాఖ్యానించారు. హోదా కావాలని కోరేవారిని "దానివల్ల ఏమి వస్తుందో తెలుసా?'' అని ప్రశ్నిస్తే "తమకు తెలియదని'' వారు సమాధానం ఇచ్చారు. 
కేవలం మధ్యతరగతి వారిలో , అదీ నిరుద్యోగ యువత లోనే , ఆంధ్రుల ఆత్మ గౌరవం మంటగలిసి పోతుందనే  సెంటిమెంటల్ భావం, దానితో పాటు ఉద్యోగ అవకాశాలు పెంచే పరిశ్రమలు రావనే  అనుమానం , భయం  ఉన్నాయి .  దానికి ప్రధాన ముద్దాయి BJP, MODI    అని భిన్న ప్రతిపక్షాలు చెబుతున్న విషయాన్ని తిప్పికొట్టే సత్తా ఉన్నవాళ్లు BJP  లో  కనబడటం లేదు .
 చంద్రబాబు ని ఎవ్వరూ అనుమానించడం లేదు . ఎందుకంటే , ఆయన పడుతున్న  కష్టం
 అందరూ చూస్తున్నారు . ఈ సమయం లో ఆర్ధిక పరిజ్ఞాన మున్న వారు  సోషల్ మీడియాలో వారి అభిప్రాయాలను తెలియ చేస్తూ  భయాలను , అపోహలను పోగొట్ట వలసిన అవసరం ఉంది . 
                        కష్టాలలో ఉన్న రాష్ట్రానికి  హోదా , ప్రత్యేక ప్యాకేజి కంటే ముందు , కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయము తప్పనిసరి . పన్నుల్లో రాష్ట్ర వాటా ని త్వరగా కేటాయించాలన్నా ,  FRBM నిబంధనలను కొద్దిగా సడలించి రాష్ట్ర రుణ పరపతిని పెంచాలన్నా , విదేశీ రుణాలతో నెలకొల్పే ప్రాజెక్ట్ లకు గారంటీ  ఇవ్వాలన్నా , కేంద్రీయ సంస్థలను స్థాపన చేయాలన్నా , కేంద్ద్రంతో సయోధ్య తప్పనిసరి . కేంద్రాన్ని కాదని ఇవేమీ ముందుకు సాగవు . కాబట్టి కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయము , సయోధ్య అత్యంత అవసరం .  
  •  వెనుకబడిన ప్రాంతాలను గుర్తించాలి . సహజం గా మన రాష్ట్రం లో ఉన్న 13 జిల్లాలలో , రాయలసీమ 4 మరియు ఉత్తరాంధ్ర 3 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని అందరికి తెలిసిందే . కాబట్టి ఈ జిల్లాలలో ముందుగా ప్రభుత్వ భూములను గుర్తించి లాండ్ బాంక్ లు ఏర్పరచి ,పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాలి . దీనికి ముందుగా రాష్ట్ర -కేంద్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి రావాలి .
  • పెట్టుబడి లో  25 నుండి 40 శాతం ప్రోత్సాహక సాయం ( enhanced investment allowance ) మరియు ఏడాదికి 30 శాతం చొప్పున తరుగుదల లెక్కింపు , మొదలైన ప్రోత్సాహకాలు పారిశ్రామికవేత్త లకు  కేంద్రం ఇవ్వాలి . అలాగే రాష్ట్ర ప్రభుత్వం  పరిశ్రమలకు మొదటి రెండేళ్లు 30 శాతం ఉచిత కరెంట్ ఇవ్వాలి . 
  •  పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ లో మూడు భాగాలు ఉన్నాయి . ఒకటి సాగునీటి ప్రాజెక్ట్ , తాగునీటి పధకం , జల విద్యుత్ ప్రాజెక్ట్ . మొత్తానికి కలిపి 2011 లెక్కల ప్రకారం 16వేల  కోట్లు  ఖర్చు అయ్యే ప్రాజెక్ట్  అని  కేంద్రం అంటుంది . దీనిలో విభజనకు ముందే సుమారు 5000 కోట్ల పనులు పూర్తయ్యాయి . కాబట్టి ఇంకా అవసరమయ్యే 11000 కోట్లలో సుమారు 8000 కోట్లు (సాగునీటి ప్రాజెక్ట్  కి మాత్రమే ) ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చ్చింది . కానీ ఇది సరి పోదు . ఎందుకంటే 2016 లెక్కల ప్రకారం  మూడు విభాగాల మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు అంచనా 26 వేల కోట్లు . దీంట్లో 5000 కోట్లు  విభజనకి ముందే ఖర్చు పెట్టేశారు . ఈ  విషయాన్ని దృష్టిలో పెట్టు కోవాలి . కాబట్టి 2014 ఏప్రిల్ నుండి మూడు విభాగాల తో కూడిన  మొత్తం ప్రాజెక్ట్ కి అయ్యే ఖర్చు మొత్తం  కేంద్రమే  భరించాలి . ప్రాజెక్ట్ లు ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరిగిపోతా ఉంటుంది . రాష్ట్రానికే నిర్మాణ బాధ్యత అప్పగించినా , ఆలస్యమైతే పెరిగే ఖర్చుని కూడా భర్తీ చేయాలన్న నిబంధన తప్పనిసరి గా ఉండాలి .అంతే కాదు ,రాష్ట్రం . గత 2 ఏళ్లలో పోలవరం పైన  సుమారు 4000 కోట్లు ఖర్చు పెట్టారు . కాబట్టి  ఆ డబ్బు కూడా కేంద్రం  రీ ఎంబర్స్ చేయాలి.  
  • 2014-15 ఆర్ధిక సంవత్సరం లో రెవెన్యూ లోటు 14000 కోట్లు అని కేంద్రమే ఒప్పుకొంది . ఇదంతా కేంద్రమే భరించాలి . కానీ ఇప్పటివరకు కేవలం 2000 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చ్చింది . మిగతా 12000 కోట్లు ఎప్పటి కిచ్ఛేను? కేంద్రం వెంటనే ఇవ్వాలి .
  • సంక్షేమ పథకాలైన రైతు ,చేనేత కార్మికుల , ద్వాక్రా గ్రూపుల కు రుణ మాఫీ , అలాగే చంద్రన్న కానుకలు మొదలైన వాటివలన ఇంతగా ఖర్చు పెట్టారని కేంద్రం గుర్రుగా ఉంది. 10 వ PRC  వలన నెల వారీ జీతాల బిల్లు 2100 కోట్ల నుండి అమాంతం 3400 కోట్లకు అనగా 1300 కోట్ల భారం ఏటా పడుతుంది . ఇంతగా రైతు ,చేనేత ,ద్వాక్రా ,ఉద్యోగుల సంక్షేమానికి పాటు బడటం వలన ఆదాయ వనరులు 12 శాతం పెరిగినా కూడా ఇంకా 14000 కోట్లు లోటు ఉంది .  

సంక్షేమం , అభివృద్ధి అనేది పాలకులకు రెండు కళ్ళ వంటివి . అందరినీ కలుపుకొని , అందరికీ సుఖశాంతులు అందిస్తూ (Inclusive growth) ముందుకు పోవలసిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గట్టిగా నమ్ముతున్నారు . అంతెందుకు, మొన్నటివరకు రైతురుణ మాఫీని విమర్శించిన మోడీ గారే గుజరాత్ , తదితర  BJP  పాలిత  రాష్ట్రాలలో  రైతులరుణ మాఫీ లేకాదు,  చంద్రబాబు గారికంటే ఎక్కువ హామీలు గుప్పించారు. 
  • కాబట్టి కేంద్రం, రాష్ట్రంలోని పరిస్థితులను గమనించి , వెంటనే రెవెన్యూ ( ఆదాయ ) లోటుని పూడ్చాలి. 2014-15  16079 కోట్లు . దీనిలో 2303 కోట్లు కేంద్రం ఇచ్చ్చింది . మిగతా 13776 కోట్లు వెంటనే  ఇవ్వాలి . 2015-16 పద్దు కింద 5000 కోట్లు ఇవ్వాలి .2016-17 పద్దు కింద 5000 కోట్లు ఇవ్వాలి . ఏది ఏమైనా ఏడాదికి సుమారు 5000 కోట్ల రెవెన్యూ ( ఆదాయ ) లోటు ఉంటుంది . కనీసం 10 ఏళ్ల పాటు కేంద్రమే ఈ లోటుని భర్తీ చేయాలి . 
  •  ఇంకో విషయాన్ని కూడా గమనించాలి . ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టడం మంచిది కాదు . కానీ , పేదలకు రెండు లక్షల ఇళ్లు  , పోలవరం ప్రాజెక్ట్ , కోర్ కాపిటల్ భవనాలు  వచ్ఛే 3 ఏళ్లలో పూర్తి చేయడానికి , ఆదాయానికి మించి ఖర్చు పెట్టక తప్పదు . 
  • పరిశ్రమలకు , వ్యవసాయ రుణాలకు రాయితీలు ఇవ్వాలి .
  • కనీసం వచ్ఛే ఐదు ఏళ్లలో 20000 కోట్లు రాజధాని కోర్ భవనాలకు , మౌలిక సదుపాయాలకు ఖర్చు అవుతుంది . 

దీనివల్లనే ఫిస్కల్ లోటు కూడా ఇబ్బడి ముబ్బడి గా పెరగక తప్పడం లేదు . 
ప్రస్తుతం , ప్రభుత్వం ఏటా సుమారు 15000 కోట్లు అప్పు తీసు కొంటుంది . నాబార్డ్, ప్రపంచబ్యాంక్,ఆసియన్ అభివృద్ధి బాంక్ లేకాదు, రాష్ట్రప్రజలనుండికూడా బాండ్ ల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకునే అవసరం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపటి బడ్జెట్ లో ఆంధ్రాకి న్యాయం చేయాలి. 
అలాజరగని పక్షంలో మీనమేషాలు లెక్కించకుండా వెంటనే NDA  ప్రభుత్వం నుండి తప్పుకొని నిరసన ప్రకటించాలి. కావాలంటే బయటనుండి అంశాలవారీగా మద్దతు ప్రకటించుకోవచ్చు. 
ఆంధ్ర ప్రభుత్వానికి ,  జమిలి ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం లేదు . ఖర్చు ఎక్కువైనా ప్రభుత్వం పూర్తికాలం నిలబడి,పోలవరాన్ని పాక్షికం గానైనా పూర్తి చేసి సాగునీరు అందించే ఏర్పాటు, రాజధాని భవనాల నిర్మాణం పూర్తి చేసే ఏర్పాటు జరిగిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళవచ్చు. 

మోడీ పై ఉన్న వ్యతిరేకత దానితో కలిసివుండే పార్టీలపై పడటం ఖాయం. 
మోడీ కొన్నివిషయాలలో ముఖ్యంగా మంచి  విదేశీ పాలసీలు,అవినీతిరహితమైన  పాలన చేసినా , ప్రజాస్వామ్య విలువలను,నియమాలను తోసిరాజని ఒంటెత్తు పోకడలు పోవడం,పైపెచ్చు అటు హిందూ వాదులకు, ఇటు మైనారిటీలకు కూడా అసం తృప్తి కలిగించడం,రాష్ట్రాల మనోభావాలను  పట్టించుకోకపోవడం, నియంతమాదిరి గా కనిపించడం,  రాజకీయలబ్ది కోసం,తమిళనాడు సంక్షోభాన్ని అవకాశంగా మలచుకొని,అవినీతితో కుళ్లిపోయిన DMK వారిని కలవడం, 2 G కేసులను నీరుగార్చారని న్యాయస్థానమే ఆక్రోశించడం,గుజరాత్,బీహార్ ఎన్నికల సమయంలో మోడీ ప్రవర్తన, మెజారిటీ దక్షిణ భారతీయులకు రుచించడం లేదు. 

4 ఏళ్ళక్రితం  మోడీని ఎంతగానో ఆరాధించిన సినిమా నటులు, వివిధ వృత్తిలో ఉన్నవారే , నేడు మోడీ ని అసహ్యించు కొంటున్నారు. దీనికి కారణం ఆయన  తీసుకొన్న నిర్ణయాలను సరైన రీతిలో కమ్యూనికేట్ చేయలేకపోవడమే అనిపిస్తుంది. మన్ కి బాత్ లాంటి ప్రోగ్రాములు ఎన్ని చేసినా ఆయన మాటల్లో స్వచ్ఛత ,సమర్ధత కనబడుతుంది గానీ,క్షేత్రస్థాయిలో అస్సలేమీ కనబడటం లేదు. దీనితో ఆయన మాటల్లో విశ్వాసం తగ్గిపోతుంది.  పైపెచ్చు ఆయనకీ ఉన్న పరిజ్ఞానం పైన కూడా అనుమానం కలుగుతుంది. ఆయనలో పైకి కనబడే హుందాతనం , ఆచరణలో కనబడటం లేదు. 
 దేశాన్ని మార్చాలనే తపనను ఆయనలో చూసే ఓట్లు వేశారు. కానీ,కేవలం ఆయన పార్టీని మాత్రమే బలవత్తరం చేసుకొంటున్నారు తప్ప రాష్ట్రాల కు  సమాన భాగస్వామ్యం ఇచ్చే ఫెడరల్ స్ఫూర్తికి  తూట్లు పొడుస్తున్నారు. 
ఆంధ్రాలో కూడా అవినీతి కేసుల్లో కోర్టు విచారణలో  ఉన్నవారితో సంబంధాలు పెట్టుకోవడం ,రాజకీయ లబ్ది  కోసం విలువలను త్యజించడం లాంటి  చర్యలు మోడీ యొక్క  స్వచ్ఛత ను మకిలి పట్టించేశాయి. 
ఎన్నికలున్న రాష్ట్రాలకు లక్షలకోట్లు ఖరీదు చేసే హామీలు గుప్పించే మోడీ, ఆంద్ర రాష్ట్రానికి న్యాయంగా రావలసిన సౌకర్యాలను కూడా ప్రకటించకపోవడం, తెలుగు వారందరినీ కలచివేస్తుంది . 
మోడీ చేసేది.చూసేది దేశం మొత్తం అభివృద్ధి కావచ్చు,అలాగని ఆంధ్రుల మనోభావాలను,గాయాలను పట్టించుకోనపుడు, మిగతా దేశం గురించి ఆంధ్రులకెందుకు? ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ను సమానంగా చూసినప్పుడే ఆయనపై గౌరవం ఉంటుంది. అలాకాక,కేవలం రాజకీయలబ్ధినే పరమావధిగా చూస్తే , ప్రధానమంత్రైనా ఒక్కటే, ట్రంపైనా ఒక్కటే! గౌరవం కోల్పోతారు.  
చంద్రబాబు లేదా జగన్ లేదా పవన్ లాంటి వుత్సాహిక రాజకీయనాయకులెవరైనా, స్వలాభం కోసం, స్వరక్షణ కోసం 5కోట్ల ఆంధ్రుల సంక్షేమాన్ని ఫణంగా పెడితే  వారి గొయ్యి వారే తవ్వుకొన్నట్లే! 
ప్రాంతీయపార్టీ లేవైనా  మోడీతో గానీ,భవిష్యత్ లో  మోడీలాంటి కేంద్ర పాలకులతో గానీ  కలిసివుంటే ఆంధ్రాలో   పతనం  కాక తప్పదు.  దీనికి ఉదాహరణ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి !

Wednesday, 25 January 2017

రాష్ట్ర ప్రజానీకానికి , యువతకు విజ్ఞప్తి . ఒక్క సారి ఆలోచించి అడుగు వేయండి .

1 . రాష్ట్రాలకు ఇచ్ఛే కేంద్రం నిధులు  32% నుండి 42% కి పెరిగిన ఈ  తరుణం లో  ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు రాయితీ లొస్తాయ్ అనే మాట అబద్దం .
2. . 2 ఏళ్ల క్రితం హోదా అనే మాటనే రద్దు చేసిన 14 వ ఆర్ధిక సంఘం తీసుకొన్న నిర్ణయం కేవలం మన రాష్ట్రానికే చెందినది కాదు . అది యావత్ భారత్ దేశానికి వర్తిస్తుంది . కాబట్టి పార్లమెంట్ లో చట్ట సవరణ ద్వారా ఆ నిర్ణయాన్ని మార్చి నప్పుడు జరిగే ఫలితం కేవలం ఆంద్ర రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి చెందే అవకాశం ఉంది . దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తే మనకు కొత్తగా ఒరిగే దేమి ఉంటుంది ?
3. నిజానికి హోదా ' వఛ్చి ఉంటే , విదేశీ సంస్థలు ,విదేశీ బాంక్ ల సాయం తో నిర్మించే ప్రాజెక్ట్ (EAP-externally aided projects) లకు కేంద్రం 90% సాయం(grant) అందిస్తుంది . హోదాలేని రాష్ట్రాలకు కేవలం 60% సాయం అందిస్తుంది . అందుకే ,హోదా అనేది ప్రస్తుత రాజ్యాంగ పరిధిలో లేనందున , మన రాష్ట్రానికి హోదా వలన ఎంత సాయం అందేదో , అంతే సాయాన్ని ( 90% ) కేంద్రం అందివ్వడానికి ఒప్పుకోవడమే ప్రత్యేక ప్యాకేజి . ఇపుడు మనం డిమాండ్ చేయవలసింది , ప్రత్యేక ప్యాకేజి  కి చట్టబద్ధత !
4 . EAP లకు  FRBM  నిబంధనలు అడ్డొఛ్చి నా , ఆ సాయాన్ని మొత్తం ఋణం  గా  చూపించి కేంద్రమే తీర్చే విధం గా కేంద్రం ఇఛ్చిన హామీ నే ప్రత్యేక ప్యాకేజి .
ఎండిపోయిన చెరువులో చేపలు పట్టినా ఒకటో రెండో చేపలు దొరక వచ్చ్చేమో గానీ ,ఎండమావులలో చేపలు పట్టు కోవాలను కోవడం  వృథా ప్రయాస .
ఏది ఏమైనా పోరాటం చేయాలీ అనుకొంటే  ముందు అవినీతి పై చేయాలి . లింగ వివక్షత పై చేయాలి . కులాల కుమ్ములాట పై చేయాలి . ఓటు బాంక్ రాజకీయాల పైన చేయాలి . ప్రాంతీయ ,భాషా దురభిమానం పై చేయాలి . ఉత్తర దక్షిణ భారతా లంటూ రెచ్చ గొట్టే  పబ్బం గడుపు కొనే వారిపై చేయాలి . 9 మరియు 10 వ షెడ్యూల్ ఆస్థుల కింద తెలంగాణ నుండి రావలసిన 70000 కోట్ల కోసం చేయాలి .
ముందుగా మనం  భారతీయులం .  ఆ తర్వాతే తెలుగు వారం .
జైహింద్ . 

Friday, 20 January 2017

 జల్లికట్టు అనే ది ఒక ఆటా ? లేక తమిళుల  సంప్రదాయమా ? లేక శాస్త్రీయమైన రహస్యం ఏమైనా దాగుందా ?
 ఎవరికీ నష్టం కలిగించని  , ఏ వ్యవస్థ ను  కష్ట పెట్టని జల్లికట్టు ,  తమిళ సంప్రదాయం లో  తరతరాలుగా పెనవేసుకున్న సంప్రదాయపు క్రీడ .  దానివలన మంచే గానీ చెడు జరగదు . జంతువులను ఎలా ప్రేమించాలో జంతుమాంసం తినే విదేశీయులు మనకు చెప్పనక్కర లేదు .
ఎందుకు "పెటా" లాంటి విదేశీ కారుణ్య సంస్థలు పని గట్టుకొని భారత దేశ సంప్రదాయాలలో,సాంస్కృతిక  కార్యక్రమాల యందు వేలు పెడుతున్నారు ?
ఆడిట్ లెక్కలు కాదు కనీసం ఆదాయ వ్యయాల లెక్కలు  కూడా సమర్పించ కుండా , దొంగ ఖాతాలతో నెట్టు కొచ్చ్చే లక్షలాది  విదేశీ స్వచ్చ్చంద సంస్థలు మనదేశం లో   ప్రతిదానిలో వేలు పెట్టి అమాయకులను రెచ్చ  గొట్టి పబ్బం గడుపు కొంటున్నాయి . గ్రీన్ పీస్ అనే విదేశీ సంస్థ కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ ని ఇలాగే ఎదుర్కొన్నారు .

ఈ అరాచకాలకు  చెక్ పెట్టే  టైం  వచ్చ్చింది . తమిళ సోదరులు చేస్తున్న మెరీనా ఆందోళన,దేశంలో  మిగతా చోట్ల పేట్రేగు తున్న సాంస్కృతిక దాడుల ను ఎదుర్కొనే స్ఫూర్తిని ఇస్తుంది !సందేహం లేదు .
జైహింద్ . 

Sunday, 8 January 2017

What is Life ?

జీవితమంటే ఏమిటి ?
సుఖదుఃఖాల సమాహారం . 
సరే ,ఒక విషయం గానీ ,ఒక బంధం గానీ ,ఒక సంఘటన గానీ మనకు సుఖాన్నో ,దుఃఖాన్నో ఇస్తాయని అనుకొంటాం . 
నిజానికి  సుఖదుఃఖాలనేవి జరిగే సంఘటనల్లో ఉండవు . ఆయా సంఘటనలను మనం ఎలా తీసుకొంటున్నాం ? అనే దానిపైనే జీవితం ఆధారపడి  ఉంటుంది !
Life is 10% what happens to us but 90% of, how we react to it !