Search This Blog

Saturday 3 February 2018

ఇపుడు చంద్రబాబు ఏమి చేయాలి?

చంద్రబాబు నమ్ముకొన్న పార్టీ నట్టేట ముంచింది. ఆంధ్రావాళ్లకి మునిగిపోవడం అలవాటే! మొన్న కాంగ్రెస్, నేడు మోడీపార్టీ ముంచింది! బలయ్యేది ఎపుడూ కూడా ఆర్భాటం తప్ప ఆలోచనలేని ఆంధ్రులే! విద్యా,వ్యాపారాలు గట్రా బాగా చేస్తారు. కానీ కులాల పేరుతొ కాట్లాడుకోవటమే తప్ప, ఐకమత్యం అనేది లేదు. 
మోదీ ఆంధ్రాకు సాయం  చేసినా చేయకపోయినా  భాజ‌పాకి ఒరిగే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌దు అని మోదీపార్టీ అభిప్రాయం. ప్రాక్టిక‌ల్ గా ఆలోచించుకుంటే భాజ‌పాకి  కొత్తగా వచ్చే నష్టమేమీ  ఉండదు కాబ‌ట్టి, ఆంధ్రాపై ప్రత్యేక  అభిమానం ప్ర‌ద‌ర్శించాల్సిన రాజ‌కీయ అవ‌స‌రం వారికి లేదని మోదీపార్టీ లెక్క‌ గా కనబడుతుంది.  
         ఇపుడు,చంద్రబాబు పరిస్థితి డోలాయమానంగా ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టు, రాజ‌ధాని నిధులు, ప్రత్యేక  ప్యాకేజీ… ఇలాంటివ‌న్నీ కేంద్రం నుంచి రావాల్సిన‌వే. అన్నిటిక‌న్నా ముఖ్యంగా, నియోజ‌క వ‌ర్గాల సంఖ్య పెంపు అంశం కూడా కేంద్రం దగ్గర  ప‌రిశీల‌న‌లో ఉంది. రాజ‌కీయంగా, ఆర్థికంగా ఎలా ఆలోచించినా.. ఆంధ్ర స‌ర్కారుకు కేంద్రం అవ‌స‌రం చాలా ఉంది. ఎన్నిక‌ల‌కు ఇంకా దాదాపు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. ఈ ద‌శ‌లో భాజ‌పాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం అనేది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు ఇబ్బంది క‌లిగించే రాజ‌కీయ నిర్ణ‌యంగా మారుతుందేమో అనేది చంద్ర‌బాబు అభిప్రాయంగా క‌నిపిస్తోంది. 
అటు రాష్ట్ర అభివృద్ధిని,ఇటు తన పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి చంద్రబాబుది.  
ఓ పక్క  మోడీ పార్టీ కి 3 అవకాశాలున్నాయి. జగన్ పార్టీతో, చంద్రబాబు పార్టీతో, జనసేనతో కలిసినా ,కలవక పోయినా  పెద్దగా ఒరిగేదేమీ లేదు,పోయేదీ లేదు. కాపోతే,  మూడూ కూడా మోడీ మాట విని పడివుండే పార్టీలు .  అంతేకాదు, ఒక్క చంద్రబాబు పార్టీతప్పించి, ఎన్నికలలో ఎన్ని పార్లమెంట్ సీట్లు కావాలంటే అన్నీ ఇచ్చేసే పార్టీలవి . ఎన్నికలైన తర్వాత మూడు ఆంధ్రాపార్టీలు కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చేవే గానీ ఎదురు తిరిగేవి కాదు. కాబట్టి,మోదీపార్టీకి ఎవరైనా ఒక్కటే!
గెలుపు ఓటములు పక్కనబెట్టి  తమ  మాటవినే పార్టీలవైపు చూస్తున్నారు మోదీపార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో కలిసి ఎన్నికలలో కనీసం 12 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవాలని,అవసరమైతే మొత్తం 25 సీట్ల మద్దతు పొందే  పధకం రచిస్తున్నాయి. 
ఏతావాతా  ఆంధ్రాకి  ఏమిచేసినా మోడీ పార్టీకి ఓట్లు పడవు. కాబట్టి, ఎన్నికలకు ముందో,ఆ తర్వాతో సీట్లు బేరం కుదుర్చుకొంటారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత  అవసరాన్ని బట్టి, అటు  జగన్ పార్టీ  ఇటు చంద్రబాబు పార్టీ పార్లమెంట్ సభ్యుల మద్దతును పొందినా ఆశ్చర్య పడవలసింది లేదు.కాబట్టి మోదీపార్టీకు చాయిస్ ఎక్కువ ఉంది.  చంద్రబాబుకి అంత వెసులుబాటు లేదు. 

చంద్రబాబు పార్టీ ,ఆచితూచి అడుగు వేయవలసిన సమయమిది. అలాగని నమ్మించి మోసం చేసిన మోడీ పార్టీని వదిలేయక పోతే ,ఆంధ్రాజనం చంద్రబాబు పై తిరగబడే పరిస్థితి.   
ఎలా జరగాలంటే ఆలా జరుగుతుందనే భావంతో,ఆంధ్రుల సెంటిమెంట్ ని గౌరవించి మోదీపార్టీతో తెగతెంపులు చేసుకొని ఎన్నికలకు సిద్ధపడటమే  పార్టీకి మంచిది.  
కేంద్రం,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనివన్నీ అక్షరాలా అమలు చేయ వలసిందే! కొత్త ఆంధ్రరాష్ట్రంలో ఒక్క చంద్రబాబు గారికి కి తప్ప మరో నాయకుడెవ్వరికీ అలా అమలు జరిపించే పరిపాలనా అనుభవం
లేదు . అధికారం పై యావ తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అంకితభావం కూడా లేదు. అంతేకాదు, మోడీకి గానీ లేక రాబోయే ఏ పాలకులకైనా వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసి,జాతీయ స్థాయిలో ఒక స్థాయిని కల్పించుకోలేకపోతె , రేపు ఆంధ్రాలో ఎన్నికలలో గెలిచినా , ఆ కేంద్రప్రభుత్వం లెక్క చేయదు.

అలాంటి కూటమిని నడిపించే స్థాయి కేవలం చంద్రబాబుగారి కే ఉంది. నిజానికి ఈ విధమైన కౌంటర్ గ్రూప్ లనేవి ప్రాంతీయ వాదానికి కొమ్ముకాసి,జాతీయ వాదానికి తూట్లు పొడుస్తాయి. కానీ అనాధగా ఉన్న రాష్ట్రాన్ని బతికించుకోవడానికి తప్పదు. ఉత్తరాది రాష్ట్రాల కు ఏ విధంగా నిధులు గుమ్మరిస్తున్నారో కనీసం ఆలా ఇచ్చినా ఆంధ్రాకి చాలు.
కాబట్టి, జాతీయస్థాయి పార్టీకి కౌంటర్ గ్రూప్ ని బలవత్తరం చేసుకొంటే తప్ప,ఫెడరల్ వ్యవస్థ బతికి బట్టకట్టే కాలంకాదు.
ఒక వేళ రేపు ఆంధ్రాలో చంద్రబాబుగారి పార్టీ కాక మరోపార్టీ గెలిచినా కేంద్రం తీరు ఇంతే ! ముందు, ఏదో సాయం చేస్తున్నట్లు నటిస్తారు తప్ప క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రయోజనం ఉండదు.
ఎన్నికలలో ఓటర్లు తమ చెప్పు చేతల్లో ఉండటానికి నాయకులు వారిని పూర్తిగా ఎదగనీయరు. అలాగే రాష్ట్రాలు తమ చెప్పుచేతల్లో ఉండటానికి,కేంద్రం, రాష్ట్రాలను పూర్తిగా బలపడనీయని కాలమిది.
 
రాష్ట్ర లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ద్రవిడ పార్టీల లెక్క   జగన్,చంద్రబాబు కలిసి రాష్ట్ర విభజన హక్కులకోసం డిమాండ్ చేయాలి.  చంద్రబాబు,మోదీపార్టీతో తెగతెంపులు చేసుకొని  అన్నిపార్టీలను  కలుపుకొని కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. ఆలా పనిచేస్తేనే ఆంధ్రాకి లాభం తప్ప, లేకుంటే నష్టపోయేది ఆంధ్రరాష్ట్రప్రజలు,లాభపడేది ఉత్తరాది పార్టీలు. 
ప్రజలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లేయాలి. 

No comments:

Post a Comment