Search This Blog

Thursday 6 December 2012

అహింస అంటే ఏమిటి ?

అహింసా పరమో ధర్మ :  

ధర్మ హింసా  తదేవ చ :

ఆయుధం లేని దేవుడు ఉన్నాడా ఆయుధం లేని దేవత ఉందా.?
అహింసా పరమో ధర్మ :   అనేది కేవలం సన్యసించి, వైరాగ్య మార్గంలో ఉన్న సాధు సంతులకు మాత్రమే. ఒక సాధువును హింసించినా, తనకు ప్రాణహాని కలుగుతున్నా , తనని తాను రక్షించుకోవడానికి కూడా, ఆయుధం చేత బట్టడు. కారణం, సకల చరాచర సృష్టిలో తనని తాను చూసుకుంటూ అవతలి జీవిలో కూడా పరమాత్మని చూస్తాడు కాబట్టి !

ధర్మ హింసా  తదేవ చ : కూడా అంతే గొప్పది. సనాతంధర్మంలో ధర్మ హింస అనేది క్షాత్ర ధర్మం. దానిని అనుసరించి , సంఘాన్ని రాక్షసుల బారినుంచి, దోపిడీ ముఠాల నుంచి, క్రూర మృగాల నుంచి, దుర్మార్గులనుంచి రాజులు రక్షించేవారు. కానీ నేటికాలం లో ముఖ్యంగా భారతదేశం లాంటి ప్రజాస్వామ్యం లో రక్షించడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత.

కష్ట నష్టాలను ,దౌర్జన్యాలను ,అవినీతి ,అధర్మాలను ,అన్యాయాలను ,దోపిడీని  ఉపేక్షించి , ముడుచుకొని మూల కూర్చోవటం  మాత్రం కాదు .  ఉదాహ రణ  కు గాంధీ అహింస మార్గాన్ని ఎంచుకొని పోరాటం చేశాడు తప్ప అహింస అని వల్లిస్తూ మూలన కూర్చో లేదు. 

సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు! 

అన్యాయాన్ని,అధర్మాన్ని ఎదిరించి పోరాడవలసిందే! కొందరు కర్రను పెట్టుకొంటే గాంధీ అహింస అనే ఆయుధాన్ని పట్టుకొన్నాడు. 

అన్ని సందర్భాలలో అహింస విజయవంతం అవుతుందని చెప్పలేం. కొన్ని సార్లు ధర్మరక్షణకోసం హింస చేయాలి. అది కూడా అహింస గానే చూడాలి. 

ముఖ్యమైన విషయం ఏమిటంటే, పదిమంది మంచికోసం ఒక్కడిని హింసించడం లో తప్పేమీ లేదు. 

వైద్యుడు ఆపరేషన్ చేసి పాడైన అవయవాన్ని తొలగించడం హింస కాదు గదా? 

అధర్మాలను
 ఎదుర్కొని న్యాయం సాధించుకోవడం ,కానీ ఆ ఎదుర్కొనే విధానం లో హింస ఉండ వచ్చు, లేకపోవచ్చు. .
నిన్నె వారైనా కొడితే తిరిగి కొట్టక పోయినా, వారి నుండి
   క్షమార్పణ వచ్చె వరకు వారిని ఎదుర్కోవటమే అహింస .
సమాజానికి అన్యాయం జరిగితే ,న్యాయం జరిగే వరకు హింస లేకుండా
  పోరాడటమే అహింసా విధానం . మంచి,మానవత , న్యాయ ధర్మాల కోసం  పోరాటం చేయవలసిందే! యుద్ధం జరగవలసిందే! 

ధర్మ రక్షణే అహింస.     దేహాలను కాదు , ధర్మాన్ని హింసించ కూడదు. దేహరక్షణకంటే ధర్మరక్షణ మేలు!

అహింస అంటే సమస్యనుండి పారిపోవడం కాదు. నిలబడి ఎదుర్కోవడం ! 

అహింస అనే ఆయుధం తో కొన్నిసార్లు   దుర్మార్గుల మనస్సును  కూడా గెలవ వచ్చు.    

 అహింస కూడా ఒక విధమైన తపస్సే! 

 తపస్సు అంటే ఏమిటి? 

మనో వాక్ కాయములతో దైవస్మరణ,దైవజపం,దైవకార్యం  చేయడమే తపస్సు. 

 నిర్ణయాలు చేసే బుద్ధితో  సత్య మే పలికే ధైర్యాన్ని,  అహింస యే పరమాయుధంగా వాడే కుశలతను, దైవం పై నమ్మకం,శ్రద్ధ కలిగిఉండే ఓర్పును  కలిగిఉండటమే తపస్సు. 

తపస్సు పరమార్ధం ఏమిటి ?

తపస్సు పరమార్థం త్రికరణ శుద్ధియే.!  చిత్త శుద్ధి , త్రికరణ శుద్ధి శాంతిని అందిస్తాయి. శాంతిద్వారా రాగద్వేషాలు తొలుగుతాయి. అరిషడ్వర్గాలు నశిస్తాయి' అన్నది యోగవాసిష్ఠంలో చెప్పబడింది

తపస్సు ఎలా చేయాలి? 

దేహంతో అంటే భౌతికంగా జరిపే పూజ, వాక్కుతో జపం, మనస్సుతో దైవధ్యానం,  అహింస,ధర్మరక్షణ, సత్య వాక్ పాలన ,దైవ శరణాగతి,నిరంతరం భగవత్  శ్రద్ధతో ఉండే బుద్ధి తద్వారా  దేహ, మనో, బుద్ధి, ఇంద్రియ నిగ్రహాలు అలవడుతాయి. అంతేకాదు ప్రాపంచిక బాధ్యతలను దైవం అప్పచెప్పిన బాధ్యతలుగా భావించి దైవకార్యంలా చేయడమే కాయతపస్సు. దీనినే కర్మకౌశలం, కర్మయోగం అనికూడా అంటారు. 

ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం తపస్సుకు మరీ ముఖ్యమైన రెండు సాధనాలు. బుద్ధి సాత్వికం గా దైవబద్ధంగా ఉంటేనే మనో  ఇంద్రియాల పైన అదుపు ఉంటుంది. 

 మంచీ-చెడూ , పాపం-పుణ్యం; సుఖదుఃఖాలు,సంతోష విచారాలు,మానావమానాలు అనే ద్వందాలు  ధర్మ  జిజ్ఞాస పరిధి లో ఉంటాయి . 

ధర్మ పరిధిని దాటి పరబ్రహ్మ పరిధికి చేరినప్పుడు మంచీ,చెడూ అనే ద్వందాలేవీ ఉండవు. 

తిను -తినిపించు;గెలువు-గెలిపించు; సంతోషాలను పంచు --ఇదే యజ్ఞం. 

పాత్రత నెరిగి దేశకాల మాన స్థితులకు అనుగుణంగా  ప్రేమతో బాధ్యతగా కొంత పంచడం-   దానం.  

తపస్సు అంటే సంకల్ప బలం ఎక్కువగా ఉన్న సాత్విక  బుద్ధి అని పైన  మనం వివరంగా చెప్పుకొన్నాం. 

 యజ్ఞ దాన తపో కార్యాలు కర్త్రుత్వ భావన అనగా నేనే చేస్తున్నాననే అహంకారం లేకుండా  చేయడమే సాత్వికత. 

సాత్వికత అనేది ఒక సాధనం. 

సాత్వికత ద్వారా దేహ ప్రపంచ పరిధినుండి ఆత్మ పరిధికి చేరుకోవడమే బ్రహ్మ విద్యా సాధన.  

No comments:

Post a Comment